ట్విషా శర్మ మృతి కేసులో కీలక మలుపు.. ఆమె అత్త‌ మాజీ జడ్జి గిరిబాలా సింగ్ అరెస్ట్

  • కోడలి మృతి కేసులో రిటైర్డ్ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ
  • మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమె ముందస్తు బెయిల్‌ను రద్దు చేయడంతో అరెస్ట్
  • మృతురాలు ట్విషా శర్మ శరీరంపై ఏడు గాయాలు ఉన్నట్టు గుర్తించిన హైకోర్టు
  • గిరిబాలా, ఆమె కొడుకు వరకట్నం కోసం వేధించారని ట్విషా కుటుంబం ఆరోపణ
  • సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని హైకోర్టు వ్యాఖ్య
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరకట్న మరణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కోడలు ట్విషా శర్మ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఇవాళ‌ అదుపులోకి తీసుకుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమెకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసిన మరుసటి రోజే సీబీఐ ఈ చర్యలు చేపట్టింది.

భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న గిరిబాలా సింగ్ నివాసానికి ఈరోజు ఉదయం భారీ పోలీసు బలగాలతో సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి, ప్రజల రాకపోకలను నియంత్రించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గిరిబాలా సింగ్ కుమారుడు సమర్థ్ సింగ్‌తో 2025 డిసెంబర్ 9న ట్విషా శర్మకు వివాహం జరిగింది. పెళ్లయిన ఐదు నెలలకే (ఈ నెల‌ 12న) ట్విషా తన అత్తవారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

ఈ ఘటన తర్వాత గిరిబాలా సింగ్ ముందస్తు బెయిల్ కోసం భోపాల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించగా, ఈ నెల‌ 15న ఆమెకు బెయిల్ మంజూరైంది. దీనిపై ట్విషా కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు వెకేషన్ బెంచ్, కింది కోర్టు కీలకమైన వాస్తవాలను సరిగ్గా పరిశీలించలేదని వ్యాఖ్యానిస్తూ బెయిల్‌ను రద్దు చేసింది. నిన్న‌ 17 పేజీల తీర్పును వెలువరిస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో ఆరోపణలు కేవలం భర్త సమర్థ్ సింగ్‌కు మాత్రమే పరిమితం కావని హైకోర్టు స్పష్టం చేసింది. వాట్సాప్ చాట్‌లు, ట్విషా కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను బట్టి గిరిబాలా సింగ్ పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. గిరిబాలా, ఆమె కొడుకు ట్విషాను గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది.

ట్విషా మృతికి ఉరి వేసుకోవడమే కారణమని పోస్ట్‌మార్టం నివేదికలో తేలినప్పటికీ, ఆమె శరీరంపై అదనంగా ఆరు నుంచి ఏడు గాయాలు ఉన్న విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ గాయాలు మృతదేహాన్ని తరలించేటప్పుడు అయినవి కావని తదుపరి విచారణలో స్పష్టమైంది. సైబర్ ఫోరెన్సిక్స్, క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందిన గిరిబాలా సింగ్, తన నైపుణ్యాన్ని ఉపయోగించి సాక్ష్యాలను తారుమారు చేసి ఉండవచ్చని ట్విషా తండ్రి తరఫు న్యాయవాది వాదించారు. దర్యాప్తు బృందం పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆమె సహకరించలేదని మధ్యప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ప్రశాంత్ సింగ్ తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌), వరకట్న నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ ఆరోపణలపై లోతైన దర్యాప్తు అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో సీబీఐ గిరిబాలా సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేసింది.

Giribala Singh
Twisha Sharma
dowry death case
CBI investigation
Madhya Pradesh High Court
anticipatory bail cancelled
Katara Hills Bhopal
Samarth Singh
domestic violence
Indian Penal Code

More Telugu News